జీడిమెట్ల : 'మాది దిల్దార్ సర్కార్.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది. కాంగ్రెస్, కమలం నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందినయి. గడిచిన ఐదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నగరవ్యాప్తంగా 104 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేస్తాం. బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటాం' అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
అభివృద్ధి అంటే ఆ రెండు పార్టీలకు తెలుసా..?
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో మహానగరం గడిచిన ఐదేండ్లలో విశ్వనగరంగా మారిందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
మన్ననలు పొందుతున్న మ్యానిఫెస్టో..
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నదని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ముఖ్యంగా 20వేల లీటర్ల వరకు ఉచిత నల్లానీరు, బార్బర్ షాపులు, లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ సరఫరా, పరిశ్రమలకు కనీస డిమాండ్ చార్జీల రద్దు, ఆటో క్యాబ్ డ్రైవర్లకు పన్ను మినహాయింపు పట్ల ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను ప్రకటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా పథకాలు అమలు అవుతాయని చెప్పారు. మచ్చలేని మనిషి టీఆర్ఎస్ అభ్యర్థి బి.విజయశేఖర్గౌడ్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ ఇన్చార్జిగా అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు.

