
గాంధీనగర్, ఆగస్టు 10: జనసమూహ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వాళ్లు ఇకపై రూ.1000 జరిమానా చెల్లించాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా మాస్క్ ధరించని వాళ్లకు ఇప్పటి వరకు రూ.500 జరిమానా విధించామని, దీనిని రూ.1,000కి పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించేలా చూడాలంటూ, ధరించని వాళ్లకు విధించే జరిమానాను పెంచాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు వైరస్కు అడ్డుకట్ట వేయడానికే జరిమానాను పెంచుతున్నామని వెల్లడించింది.
పెరిగిన జరిమానా మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.