- ఇంకా 2వేల కోట్లకు పైగా బకాయిలు
- అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
- రుణాన్ని పక్కదారి పట్టించి.. ఎగవేత
- వరి రైతులదీ అదే గోస.. సన్నధాన్యం బోనస్పై కిక్కురుమనని రాష్ట్ర సర్కార్
- పంటల పైసల కోసం రైతుల అరిగోస
హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటికీ పైసలు మాత్రం రైతులకు జమ చేయడంలేదు. సర్కార్ తీరుతో ఇటు మక్క రైతులు, అటు సన్నదాన్యం రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్నారు. వానకాలం మొదలుకావడంతో పంట పైసలొస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయనే రైతుల ఆశలపై సర్కార్ నీళ్లు చల్లుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతుభరోసా ఇవ్వకుండా మరోవైపు పంట పైసలియ్యకపోతే పెట్టుబడి ఎలా? అని రైతులు మదనపడుతున్నారు.
మక్క రైతులకు రూ.2వేల కోట్ల బకాయి
మక్క రైతులకు కాంగ్రెస్ సర్కార్ భారీ మొత్తంలో బకాయి పడింది. ఇంకా సుమారు రూ.2వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని తెలుస్తున్నది. యాసంగిలో రైతుల నుంచి సుమారు 16 లక్షల టన్నుల మక్కలను క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరకు కొనుగోలు చేసింది. విక్రయించిన రైతులకు రూ.3,900 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రూ.1,800 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా తెలిసింది. అంటే ఇంకా రూ.2,100 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టుగా తెలిసింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తుందో? కూడా చెప్పడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఆ బకాయిల కోసం క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రేపూమాపు అంటూ అధికారులు దాటవేస్తున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రుణం ఇంకా రాలేదని, చెల్లింపులకు సమయం పడుతుందని సర్కార్ చెబుతున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి మక్కల కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ రూ.4వేల కోట్ల రుణం తీ సుకొన్నది. ఇందులో రూ.2వేల కోట్లను మార్క్ఫెడ్ పక్కదారి పట్టించినట్టుగా సమాచా రం. మక్క రైతుల కోసం తీసుకొన్న రుణంతో పాత రుణాలను చెల్లించినట్టుగా తెలిసింది. దీంతో మక్క రైతుల చెల్లింపులు ఆలస్యం చేస్తున్నట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సన్నధాన్యం రైతులకు రూ.700 కోట్లు
సన్నధాన్యం రైతులు కూడా అదే గోస పడుతున్నారు. సన్నధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ యాసంగిలో రైతుల నుంచి 14 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది. ఆ మేరకు రైతులకు బోనస్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటివరకు రైతులకు నయాపైసా చెల్లించలేదు. ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా.. బోనస్కు అవసరమైన నిధులను సర్కార్ విడుదల చేయకపోవడం గమనార్హం. దీంతో ఈ యాసంగిలోనూ కాంగ్రెస్ సర్కార్ బోనస్ పైసలకు ఎగనామం పెట్టినట్టేనా? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగిలో సన్నధాన్యం రైతులకు రూ. 1,159 కోట్లను ఎగబెట్టింది. దీంతో ఈ యాసంగిలోనూ ఎగవేత ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వానకాలం పెట్టుబడులెట్ల?
రైతులను కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు వానకాలం మొదలైంది. విత్తనాలు, ఎరువులు, దున్నకాలు, కూలిపనులకు ఇలా పలు అవసరాల కోసం రైతులు పైసల కోసం తిప్పలు పడుతున్నారు. రైతుభరోసా ఇస్తేనైనా ఎంతో కొంత ఉపయోగపడుననే ఆలోచనలో రైతులు ఉన్నారు. అమ్మిన పంటల పైసలైనా త్వరగా ఇస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. రైతుభరోసా ఇవ్వదు, పంట పైసలియ్యదు.. మరి వానకాలం పంటలకు పెట్టుబడులెట్ల? అని రైతులు ఆందోళనలో ఉన్నారు. సర్కార్ తీరుతో భారీ వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ మండిపడుతున్నారు. అప్పు చేయకపోతే పంటలు వేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

