ఇంఫాల్: మణిపూర్లో మైతీ, కుకీ తెగల మధ్య సంఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కుకీ ఎమ్మెల్యేలు తొలిసారి స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ వారి నిర్ణయాన్ని స్వాగతించారు.
రాష్ట్రంలో ఐక్యత, శాంతిని పెంపొందించే దిశగా ఇది ఒక సానుకూల అడుగు అని అన్నారు. (Manipur Assembly) మణిపూర్ 12వ శాసనసభ 8వ సమావేశాలు బుధవారం ఇంఫాల్లో ప్రారంభమయ్యాయి. తెగల మధ్య సంఘర్షణ నేపథ్యంలో మూడేళ్లకు పైగా విరామం తర్వాత కుకీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు అసెంబ్లీకి స్వయంగా రావడం ముఖ్య పరిణామంగా నిలిచింది. సైతు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే హాఖోలెట్ కిప్జెన్, సైకుల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కిమ్నియో హావోకిప్ హాంగ్షింగ్ స్వయంగా సభకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత తిరిగి అసెంబ్లీకి హాజరుకావడం సంతోషంగా ఉందని హాఖోలెట్ కిప్జెన్ అన్నారు.
కాగా, కుకీ సామాజిక వర్గానికి చెందిన మణిపూర్ ఉప ముఖ్యమంత్రి నెమ్చా కిప్జెన్ వర్చువల్గా సమావేశాలకు హాజరయ్యారు. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశానికి ఆరుగురు కుకీ శాసనసభ్యులు వర్చువల్గా పాల్గొన్నారు. అయితే ఈసారి సమావేశాలకు ఇద్దరు కుకీ ఎమ్మెల్యేలు స్వయంగా అసెంబ్లీకి హాజరుకావడం విశేషం.
మరోవైపు కుకీ ఎమ్మెల్యేలు స్వయంగా అసెంబ్లీకి హాజరుకావడాన్ని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ స్వాగతించారు. రాష్ట్రంలో ఐక్యత, శాంతిని పెంపొందించే దిశగా ఇది ఒక సానుకూల అడుగు అని అన్నారు. సమిష్టి కృషితో మణిపూర్ శాంతి మార్గంలో పయనాన్ని కొనసాగిస్తుందని ఆయన ఆకాక్షించారు. మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 వరకు కొనసాగనున్నాయి.

