దుబాయ్: సౌదీ అరేబియాలోని పలు పట్టణాలకు హై అలర్ట్ జారీ చేశారు. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తన హెచ్చరికల్లో సౌదీ సివిల్ డిఫెన్స్ పేర్కొన్నది.
పశ్చిమ తీరంలో ఉన్న నగరాలకు ఆ హెచ్చరిక జారీ చేశారు. ముస్లింల పవిత్ర నగరం మక్కాకు కూడా హై అలర్ట్(Mecca Alert) జారీ చేశారు. జెడ్డా, టైఫ్ ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ జారీ చేసి, ఆ తర్వాత హెచ్చరికలను ఎత్తివేశారు. మక్కా నగరానికి వైమానిక దాడి హెచ్చరికలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇటీవల ఇరానీ మద్దతుతో హౌతీలు పదేపదే సౌదీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆ హెచ్చరికలు జారీ చేశారు. మదీనాలో ఉన్న ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్జిజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సర్వీసులను బంద్ చేశారు. యెమెన్ నుంచి హౌతీ మిలిటెంట్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడం వల్ల సౌదీలో 13 మంది గాయపడ్డారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 911కి ఫోన్ చేయాలని సౌదీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నది.
మొత్తం ఆరు ప్రదేశాల్లో స్వల్ప సమయం పాటు ఎయిర్ రెయిడ్ అలర్ట్లు జారీ చేసినట్లు సౌదీ రక్షణ శాఖ చెప్పింది. ఈ మధ్య కాలంలో హౌతీలు చేసిన దాడిలో సౌదీ అరేబియాలోని పలు ఆయిల్ కేంద్రాలు అంటుకున్నాయి. ఆ దాడుల్లో 73 మంది గాయపడ్డారు. యెమెన్లోని సౌదీ మద్దతు దళాలను కూడా హౌతీలు టార్గెట్ చేస్తున్నారు. సోమవారం జరిగిన దాడిలో 8 మంది సైనికులు మృతిచెందారు. ఎర్ర సముద్రంలోని నౌకలను కూడా హౌతీలు టార్గెట్ చేస్తున్నారు.

