Dailyhunt

నాడీ వ్యవస్థపైనా కరోనా ప్రభావం..

హైదరాబాద్‌: కరోనా వైరస్ సోకితే కేవలం న్యూమోనియానే కాదు.. ఆ వైరస్ ప్రభావం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. బీజింగ్‌కు చెందిన డిటాన్ హాస్పిటల్ డాక్టర్లు తాజాగా ఈ హెచ్చరిక చేశారు. కరోనా సోకిన ఓ 56 ఏళ్ల రోగి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్‌లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ పేషెంట్‌కు ఎన్‌సెఫలిటిస్(మెదడువాపు) ఉన్నట్లు నిర్ధారించారు. దీని వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు కేంద్రమైన మెదడుకు వైరస్ సోకే ప్రమాదం ఉన్నది. 2003లో సార్స్ ప్రబలినప్పుడు.. డిటాన్ హాస్పిటల్ ఆ వైరస్‌పై కీలక పోరాటం చేసింది. కరోనా లేదా కోవిడ్‌19 వల్ల.. నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందన్న విషయాన్ని చైనా మీడియా తొలిసారి వెల్లడించింది.
డిటాన్ హాస్పిటల్ నుంచి ఆ పేషెంట్ ఫిబ్రవరి 25వ తేదీన డిస్‌చార్జ్ అయ్యాడు. అతనికి కోవిడ్‌19 సోకినట్లు జనవరి 24వ తేదీన నిర్ధారించారు. అయితే జనవరి 12వ తేదీ నుంచి ఆ హాస్పటల్లో 150 మందికి చికిత్స చేశారు. దాంట్లో ఒక పేషెంట్‌కు మాత్రమే ఎన్‌సెఫిలిటిస్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.


అయితే పేషెంట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ లియూ జింగ్‌యాన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. పేషెంట్లు ఎవరైనా స్పృహ లేనట్లుగా కనిపిస్తే, అలాంటి పేషెంట్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కరోనా పేషెంట్లపై సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పరీక్షలు మరింత చేపట్టాల్సిన అవసరం ఉందని బీజింగ్ డాక్టర్లు అంటున్నారు.
కోవిడ్‌19 లక్షణాల్లో.. తీవ్ర శ్వాసకోస ఇబ్బందులు, మయోకార్డియల్ డ్యామేజ్‌, కిడ్నీ ఇంజూరీతో పాటు మరికొన్ని అవయవాలు కూడా ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. నాడీ సంబంధిత రుగ్మతలతో నమోదు అయిన కేసులు తక్కువ స్థాయిలో ఉన్నట్లు డిటాన్ హాస్పిటల్‌ డాక్టర్లు చెప్పారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana