న్యూఢిల్లీ : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశం కానున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆధ్వర్యంలో భేటీ జరుగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీఎల్ సంతోష్ పాల్గొననున్నారు. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న తొలి విడత ఎన్నికలు అసోం, పశ్చిమ బెంగాల్లో జరుగున్నాయి. ఈ నేపథ్యంలో అసోంతో పాటు బెంగాల్లో రెండు దశలకు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల నేతలతో సమావేశమై, అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే ఇప్పటికే రెండు దశల్లో జరిగే అసెంబ్లీ స్థానాల కోసం..
ఒక్కో నియోజకవర్గానికి నాలుగైదు మంది పేర్లను షార్ట్లిస్ట్ చేశామని సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆ పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.
తొలి రెండు దశల ఎన్నికలకు 120 నుంచి 140 పేర్లు వచ్చాయని తెలిపారు. సీటుకు 20 నుంచి 25 పేర్లతో జాబితా వచ్చిందని, నాలుగైదుగురి పేర్లతో షార్ట్లిస్ట్ చేసినట్లు చేశామని, గెలుపు గుర్రాలను పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ యువకులతో పాటు కొత్త ముఖాలకు చోటివ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు రాజీబ్ బెనర్జీ, సువేందు అధికారితో సహా 19 మంది టీఎంసీ నేతలు, సొంత పార్టీ నేతలకు టికెట్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల పార్టీలో చేరిన బెంగాలీ సినీ ప్రముఖుల పేర్లను సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నది. ఈ సారి ఎన్నికల్లో బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ గోపిబల్లబ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

