హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో దీనిని విడుదల చేస్తారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ కొంత కాలం క్రితం క్యాబినెట్ ఆమోందించిన విషయం తెలిసిందే. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలను ప్రకటించింది. పాలసీ విడుదల కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొంటారు.

