నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి 'చెక్' అనే టైటిల్ను ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ప్రీత్సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్ర టైటిల్, ప్రీలుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. నితిన్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుంది. ఎవరికి ఎవరు చెక్ పెడతారన్నది కథాగమనంలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. కథానాయికల పాత్రలు అభినయప్రధానంగా సాగుతాయి' అని తెలిపారు. 'వాణిజ్య అంశాలు మేళవించిన వినూత్న కథాంశమిది.
ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు ఓ షెడ్యూల్ చేస్తాం. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది' అని నిర్మాత చెప్పారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, సాయిచంద్, సంపత్రాజ్ తదితరులు నటిస్తున్న నటిస్తున్నారు.

