- l రాహుల్, ప్రియాంకతో సమావేశం
- l రెండుగంటలపాటు కీలక చర్చలు
- l పార్టీ కోసం పైలట్ పనిచేస్తారు: కాంగ్రెస్
- l సంక్షోభ పరిష్కారానికి కమిటీ
- l విశ్వాసపరీక్షకు ముందు కీలక పరిణామం
- l 14న అసెంబ్లీలో బలపరీక్ష
న్యూఢిల్లీ/జైపూర్, ఆగస్టు 10: బలపరీక్షకు నాలుగురోజుల ముందు రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. సీఎం అశోక్గెహ్లాట్పై తిరుగుబాటుచేసి సంక్షోభానికి తెరలేపిన యువనేత సచిన్పైలట్ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీతో సోమవారం సమావేశమయ్యారు. రెండుగంటలపాటు కొనసాగిన భేటీలో సంక్షోభ నివారణకు రాజీ కుదిరినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
గెహ్లాట్ ఐదేండ్లూ సీఎంగా ఉంటారు..
సచిన్పైలట్, రాహుల్ భేటీ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్సింగ్ దొటస్రా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ నాయకత్వంలో మార్పులపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని సోమవారం స్పష్టం చేశారు. అశోక్గెహ్లాట్ పూర్తి ఐదేండ్లూ సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.
కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తాలని భావించాం. ఆ పని చేశాం. నేను నమ్మిన విలువలకోసమే ఇదంతా అని మొదటినుంచీ చెప్తున్న. పార్టీ ప్రయోజనాలకోసం ఈ అంశాలను లేవనెత్తటం తప్పనసరి అని నేను భావించాను. వ్యక్తిగతంగా నామీద దాడి జరిగింది. కానీ నేను పార్టీ పదవుల కోసం ఇదంతా చేయలేదు. ఆత్మాభినాన్ని కాపాడుకోవటానికే చేశాను.
- సచిన్ పైలట్, కాంగ్రెస్ తిరుగుబాటు నేత

