Dailyhunt
పైలట్‌ ఘర్‌వాపసీ

పైలట్‌ ఘర్‌వాపసీ

  • l రాహుల్‌, ప్రియాంకతో సమావేశం
  • l రెండుగంటలపాటు కీలక చర్చలు
  • l పార్టీ కోసం పైలట్‌ పనిచేస్తారు: కాంగ్రెస్‌
  • l సంక్షోభ పరిష్కారానికి కమిటీ
  • l విశ్వాసపరీక్షకు ముందు కీలక పరిణామం
  • l 14న అసెంబ్లీలో బలపరీక్ష

న్యూఢిల్లీ/జైపూర్‌, ఆగస్టు 10: బలపరీక్షకు నాలుగురోజుల ముందు రాజస్థాన్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. సీఎం అశోక్‌గెహ్లాట్‌పై తిరుగుబాటుచేసి సంక్షోభానికి తెరలేపిన యువనేత సచిన్‌పైలట్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో సోమవారం సమావేశమయ్యారు. రెండుగంటలపాటు కొనసాగిన భేటీలో సంక్షోభ నివారణకు రాజీ కుదిరినట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

పార్టీ అధిష్ఠానంతో పైలట్‌ టచ్‌లోనే ఉన్నారని, ఆయన తిరిగి పార్టీలోకి రావటానికి రాజీ ఫార్ములా కుదిరిందని తెలిపింది. 'సచిన్‌పైలట్‌ రాహుల్‌గాంధీని కలిసి తన ఆవేదనను వివరంగా చెప్పారు. ఇరువురు నేతలు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు. పార్టీ ప్రయోజనాల కోసం పని చేసేందుకు సచిన్‌పైలట్‌ కట్టుబడి ఉన్నారు' అని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. రాహుల్‌-సచిన్‌ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌ సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలని నిర్ణయించారు. రాహుల్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సచిన్‌పైలట్‌ తాను మొదటినుంచీ బీజేపీకి దూరంగానే ఉన్నానని, ఈ రోజు తన నిజాయితీ నిరూపితమైందని వ్యాఖ్యానించారు. ఈ నెల 14న అశోక్‌గెహ్లాట్‌ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. బలపరీక్షలో సచిన్‌పైలట్‌ వర్గం ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రాహుల్‌, పైలట్‌ సమావేశం నేపథ్యంలో పైలట్‌ వర్గం ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ జైపూర్‌లో సీఎం గెహ్లాట్‌ను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సురక్షితమని ప్రకటించారు. అయితే, సచిన్‌ గతంలో చేపట్టిన పీసీసీ చీఫ్‌, డిఫ్యూటీ సీఎం పదవులను ఆయనకు తిరిగి అప్పగిస్తారా అన్న అంశంపై కాంగ్రెస్‌ స్పష్టమైన ప్రకటన చేయలేదు.

గెహ్లాట్‌ ఐదేండ్లూ సీఎంగా ఉంటారు..

సచిన్‌పైలట్‌, రాహుల్‌ భేటీ నేపథ్యంలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌ దొటస్రా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ నాయకత్వంలో మార్పులపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని సోమవారం స్పష్టం చేశారు. అశోక్‌గెహ్లాట్‌ పూర్తి ఐదేండ్లూ సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.

కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తాలని భావించాం. ఆ పని చేశాం. నేను నమ్మిన విలువలకోసమే ఇదంతా అని మొదటినుంచీ చెప్తున్న. పార్టీ ప్రయోజనాలకోసం ఈ అంశాలను లేవనెత్తటం తప్పనసరి అని నేను భావించాను. వ్యక్తిగతంగా నామీద దాడి జరిగింది. కానీ నేను పార్టీ పదవుల కోసం ఇదంతా చేయలేదు. ఆత్మాభినాన్ని కాపాడుకోవటానికే చేశాను.

- సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana