చెన్నై: తమిళనాడులోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వర్చువల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ ఆరోగ్య వ్యవస్థను ఇప్పుడు అందరూ కొత్త కళ్లతో, కొత్త గౌరవంతో, కొత్త విశ్వాసంతో చూస్తున్నారని ఆయన అన్నారు. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు మీపై దృష్టిపెట్టిందని, యువ భుజస్కందాలపై ఆ బాధ్యత ఉందని మోదీ అన్నారు. పరీక్షల్లో మార్క్లు సాధించడంతో పాటు.. సమాజంలో పేరు సంపాదించుకునే సంధి కాలంలో మీరున్నారని, కోవిడ్ మహమ్మారి వేళ భారత్ కొత్త పంథాలను వెలుగుచూసిందని, భారత్లో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉందని, అలాగే రికవరీ రేటు అధికంగా ఉందని ప్రధాని తెలిపారు.
శ్రీలంకలోని డిక్ ఓయా హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని తానెప్పుడూ మరిచిపోనన్నారు. ఈ ఆధునిక హాస్పిటల్ ఎందరికో సేవ చేస్తుందన్నారు. ఆరోగ్య రంగంలో ఈ హాస్పిటల్ వల్ల తమిళ వర్గానికి మేలు జరుగుతుందని, ఎంజీఆర్ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని ప్రధాని మోదీ అన్నారు. ఎంజీఆర్ పేద ప్రజల పట్ల ఎంతో ఉదారతతో ఉండేవారన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత వంటి అంశాలను ఆయన పట్టించుకునేవారన్నారు. శ్రీలంకలో ఎంజీఆర్ పుట్టిన గ్రామాన్ని కొన్నేళ్ల క్రితం తాను సందర్శించినట్లు తెలిపారు. శ్రీలంకలో ఉన్న తమిళల ఆరోగ్యం కోసం పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు.

