Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముప్పు'

'పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముప్పు'

– పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందానికి బీఆర్ఎస్ బూర్గంపహాడ్, అశ్వాపురం నేతల వినతి

బూర్గంపహాడ్, జూన్ 03 : పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గం ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, 86 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సంభవిస్తే పోలవరం బ్యాక్ వాటర్‌తో ఆయా ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల ప్రాణాలు, ఆస్తులు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ, జాతీయ ప్రాధాన్యత సంస్థలకు తీవ్రనష్టం ఏర్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ బూర్గంపహాడ్, అశ్వాపురం నేతలు అన్నారు.

ఈ మేరకు బుధవారం సారపాక ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న పోలవరం అథారిటీ బృందాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నాయకులు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు 12 అంశాలతో కూడిన లేఖను వారికి అందించి ఆ లేఖలోని ప్రధాన డిమాండ్లను తెలంగాణ ప్రజల హక్కులు, భద్రత, భవిష్యత్తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేయాలని కోరారు. ప్రధానంగా సమగ్ర బ్యాక్ వాటర్ అధ్యయనాన్ని తక్షణం నిర్వహించాలని, 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని స్వతంత్ర జాతీయ లేదా అంతర్జాతీయ నిపుణ సంస్థలతో కొత్త బ్యాక్ వాటర్ అధ్యయనం నిర్వహించి ఆ అధ్యయన నివేదిక పారదర్శకతతో ప్రజల ముందుంచాలన్నారు.

తెలంగాణ ముంపు గ్రామాలకు ప్రత్యేక ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని, ప్రతి ముంపు బాధిత కుటుంబానికి ఏపీలో అమలవుతున్న ప్యాకేజీతో సమానంగా లేదా అంతకంటే మెరుగైన పునరావాస, పునఃనిర్మాణ ప్యాకేజీని కేంద్రం ద్వారా అమలు చేయాలని, భూములు కోల్పోయిన రైతులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు ప్రత్యేక పరిహారం ఉండాలని, పోలవరం ఆపరేషనల్ రూల్ కర్వను సవరించాలని, వరదకాలంలో ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టాన్ని నిల్వ చేయకుండా రన్ ఆఫ్ ద రివర్ విధానం అమలు చేయాలని, జూలై నుండి ఆగస్టు వరకు అవసరమైన సమయంలో గేట్లు ఎత్తి వరద నీటి ప్రవాహాన్ని నిరాటంకంగా దిగువకు విడుదల చేయాలని, పోలవరం డిజైన్, స్పిల్ వే సామర్ధ్యం పునఃసమీక్షించాలని, కిన్నెరసాని, ముర్రేడు వాగులపై ప్రత్యేక అధ్యయనం చేయాలని, భద్రాచలం పట్టణానికి శాశ్వత వరద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు పినపాక నియోజకవర్గంలో కొత్త ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలని, పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా నియోజకవర్గంలోని బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలు తీర మండలాలు కావడంతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.

గ్రామాల్లో వ్యవసాయ భూములు, ప్రజల ఆస్తుల రక్షణ కోసం కొత్తగా రక్షణ గోడలు పోలవరం ప్రాజెక్టు వ్యయంతో నిర్మించాలని, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ కు ప్రత్యేక భద్రత కల్పించాలని, భద్రాచలం డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, గోదావరిలో భారీస్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపట్టడంతో పాటు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్ని అమలు అమలుచేయవద్దనే డిమాండ్లతో రక్షణ చర్యలన్నింటినీ పోలవరం ప్రాజెక్టు కాంపోనెంట్లలో చేర్చాలని పీపీఏకు విన్నవించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, కోడి అమరేందర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, నాయకులు వెన్న అశోక్ కుమార్, కంచుగట్ల వీరభద్రం, గొర్రెముచ్చు వెంకటరమణ, శివారపు డాక్టర్బబు, బూర్గంపహాడ్ మండల నాయకులు కర్రి నాగేశ్వరరావు, భూక్యా కృష్ణ, బొబ్బిలి, దాసు, గోపికృష్ణ, రామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana