
చెన్నై: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. రాజకీయ రంగప్రవేశం చేయడంపై ఆయన పునరాలోచనలో పడ్డట్టు సంకేతాలిచ్చారు. 2016లో తనకు మూత్రపిండాల మార్పిడి చికిత్స జరిగిందని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాజకీయాల్లోకి వెళ్లొద్దంటూ వైద్యులు సూచించారని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సూచనపై సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ వైరల్ కావడంపై ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. లేఖను తను విడుదల చేయలేదని, కానీ అందులోని అంశాలు నిజమేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చేది.. రానిది సరైన సమయంలో వెల్లడిస్తానన్నారు.