Rohit Sharma : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 'పద్మ శ్రీ' అవార్డు అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా హిట్మ్యాన్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.
వ్యక్తిగత కారణాలతో తొలి విడతలో పద్మ అవార్డు వేడుకకు దూరమైన రోహిత్.. ఈసారి హాజరయ్యాడు. నలుపు రంగు సూట్ ధరించిన మాజీ సారథి.. రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మ శ్రీ అవార్డును తీసుకోవడం చూసి అతడి భార్య రితికా సచ్దేహ్ తెగ సంబురపడిపోయింది.
టీమిండియాకు పొట్టి ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ కట్టబెట్టినందుకు రోహిత్ శర్మ పద్మ శ్రీకి ఎంపికయ్యాడు. భారత క్రికెట్కు విశేష సేవలందించినందున అతడిని కేంద్ర ప్రభుత్వం అతడిని ఈ పురస్కారంతో గౌరవించింది. మే 25 న భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి హిట్మ్యాన్ పద్మ శ్రీని స్వీకరించాల్సింది.
కానీ, వ్యక్తిగత కారణాలతో అప్పుడు దూరమైన రోహిత్.. మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డును స్వీకరించాడు. నలుపు రంగు సూట్లో వచ్చిన రోహిత్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నమర్కించి పురస్కారం అందుకున్నాడు. అవార్డు తీసుకునేందుకు వెళ్తే.. తిరిగి వచ్చే క్రమంలోనూ రోహిత్ ప్రధాని నరేంద్ర మోడీకి నమర్కించాడు. టీ20లు, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతానికి వన్డేల్లోనే ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న మాజీ సారథి ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే.

క్రీడా విభాగంలో పద్మ శ్రీకి ఎంపికైన హాకీ ప్లేయర్ సవితా పూనియా సైతం ఇదే వేడుకలో అవార్డును స్వీకరించారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.

