Dailyhunt
సంగమేశ్వరకు 2,653 కోట్లు

సంగమేశ్వరకు 2,653 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు పూర్వవైభవం సంతరించుకోనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో.. దశాబ్దాల కల సాకారం కానున్నది.

ప్రాజెక్టు ఎగువన ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. సంగమేశ్వర ఎత్తిపోతలకు రూ.2,653 కోట్లు, బసవేశ్వర ఎత్తిపోతలకు రూ.1,774 కోట్లు కలిపి మొత్తం రూ.4,427 కోట్లు కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం 36, 37 జీవోలను జారీచేసింది. ఈ పథకాలు పూర్తయితే సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో 33 ఏండ్ల క్రితం సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద ఎత్తిపోతలను చేపట్టి లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగునీటిని అందించాలని దశాబ్దాలపాటు ఇక్కడి రైతులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కానీ, ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్నిచోట్ల ఎత్తిపోతలను చేపట్టినా వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్‌.. సింగూరు ప్రాజెక్టు కింద బీడు భూములకు కూడా గోదావరి జలాలను అందించాలని సంకల్పించారు. అందులో భాగంగా సింగూరు బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసేలా సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను రూపొందించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆ రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, తాజాగా ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరుచేసింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూరు ప్రాజెక్టును అనుసంధానించేలా సీఎం కేసీఆర్‌ డిజైన్‌ రూపొందించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు 2.891 కిలోమీటర్‌ వద్ద 4 గేట్లతో ఏర్పాటుచేసిన రెండో స్లూయిస్‌ నుంచి సింగూరు ప్రాజెక్టుకు (18,19 ప్యాకేజీల ద్వారా) రోజుకు అర టీఎంసీ నీటిని పంపిస్తారు. దానికింద 1,32,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది. జలాశయం కుడివైపు బ్యాక్‌వాటర్‌ 12 టీఎంసీలను ఎత్తిపోసి జహీరాబాద్‌, అందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగులోకి తెచ్చేలా సంగమేశ్వర పథకానికి రూపకల్పన చేసింది. ఎడమవైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు.

బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించింది. రూ.16 కోట్లతో సంగమేశ్వర, రూ.11 కోట్లతో బసవేశ్వర పథకాలకు సర్వే చేపట్టి ఇటీవలే డీపీఆర్‌లను సిద్ధం చేశారు. ఇందులోభాగంగా సింగూరు ప్రాజెక్టు నుంచి 165 మీటర్ల ఎత్తుకు సాగునీటి పంపింగ్‌ చేసేలా సంగమేశ్వరను రూపొందించారు. అదేవిధంగా ఈ రెండు ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చెరువులు, కుంటలను అనుసంధానిస్తూ సుమారు 960 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం చేపట్టనున్నారు. ఈ పథకాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana