- l అంచనా వ్యయం కంటే 4.02 శాతం ఎక్కువకు కోట్
- l అంగీకారపత్రాన్ని అందించిన ఈఎన్సీ గణపతిరెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్నది. రోడ్లు, భవనాల శాఖ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించేందుకు గత నెల 10న ప్రభు త్వం జీవో47ను జారీచేసింది. రోడ్లు, భవనాల శాఖ ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు పిలిచింది. గత నెల 30 నుంచి ఈ నెల 20 వరకు బిడ్ల స్వీకరణకు గడువుగా విధించింది. భవన సముదాయం నిర్మాణంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 7న ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ నెల 20న సాంకేతిక బిడ్లను తెరవగా.. ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు బిడ్లు దాఖలు చేసినట్టు వెల్లడైంది. సాంకేతికంగానూ రెండూ ప్రైస్బిడ్లకు అర్హత సాధించాయి. అనంతరం అధికారులు ఈ నెల 23న ప్రైస్బిడ్లను తెరిచారు.
కాంట్రాక్టు అంచనా విలువ రూ.494.86 కోట్లు ఉండ గా.. ఎల్అండ్టీ కంపెనీ 4.80 శాతం ఎక్కువకు కోట్ చేయగా.. షాపూర్జీ పల్లోంజీ 4.02 శాతం ఎక్కువకు కోట్ చేసింది. ఈ రెండింటిలో నుంచి షాపూర్జీ పల్లోంజీ కంపెనీని ఎల్-1గా గుర్తించారు. బిడ్ల వివరాలన్నింటినీ రోడ్లు, భవనాల శాఖ అధికారులు కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)కి పంపగా.. అక్కడ సమగ్ర పరిశీలన తర్వాత ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి షాపూర్జీ పల్లోంజీ రీజనల్ హెడ్ లక్ష్మణ్ అగర్వాల్కు టెండర్ అంగీకార పత్రాన్ని అందించారు.

