
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తొలి రైతు వేదిక భవన నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రైతు వేదిక భవనం సిద్ధమైందని పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన ఫొటోలను సోమవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ రైతు వేదికను తంగళ్లపల్లి క్లస్టర్ రైతులకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. రైతు వేదికలు రైతులను సంఘటితం చేస్తాయని, రైతు బంధు సమితులను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. నియంత్రిత సాగుతో రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.