- శాస్త్రవేత్తల వినూత్న ప్రతిపాదన
- మహాసముద్రాలను ఉష్ణతరంగాల నుంచి రక్షించే ప్రయత్నం
- ఈ పద్ధతితో ప్రపంచ వాతావరణం అతలాకుతలమయ్యే ప్రమాదం
- ఉద్గారాలను తగ్గిస్తేనే మేలు: నిపుణులు
న్యూఢిల్లీ: రాబోయే సూపర్ ఎల్నినో చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో, పరిశోధకుల బృందం ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదించింది. సూర్యుడిని మసకబార్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో 75 శాతం వరకు తీవ్రమైన ఉష్ణ తరంగాల నుంచి రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 140 సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన ఎల్నినో చక్రానికి పసిఫిక్ భూమధ్యరేఖా ప్రాంతంలో వేడినీరు ఇంధనంగా మారుతున్నది. సూర్యుడిని మసకబార్చడం ద్వారా వేడినీరు పేరుకుపోకుండా నిరోధించవచ్చు.
స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్(ఎస్ఏఐ) అని పిలిచే ఈ వివాదాస్పద పద్ధతిలో సల్ఫర్ ఆధారిత సూక్ష్మకణాల భారీ మేఘాలను గాల్లోకి పంపుతారు. ఈ ఏరోసోల్ కణాలు వాతావరణంలోని పై పొరల్లో సంవత్సరాల తరబడి ఉండి సౌరశక్తిలో కొంతభాగాన్ని తిరిగి అంతరిక్షంలోకి మళ్లిస్తాయి. కంప్యూటర్ లెక్కల ప్రకారం.. ఇది భూగోళ ఉష్ణోగ్రతను సురక్షితమైన స్థాయిల్లో ఉంచగలదు. సముద్ర ఉష్ణ తరంగాల తీవ్రతను, కాలవ్యవధిని తగ్గించగలదు. అయితే ఈ జియోఇంజినీరింగ్ సాంకేతికత అత్యంత వివాదాస్పదమైనది. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో స్వయంగా పరిశోధకులకే స్పష్టత లేదు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన సహ రచయిత ప్రొఫెసర్ ఫోబ్ "పర్యావరణంపై దీని ప్రభావాల గురించి చాలా తక్కువగా మాత్రమే తెలుసు" అని హెచ్చరించారు. ఒకవేళ ఏమీ చేయకుండా ప్రపంచం తన ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే, ప్రపంచంలోని 97 శాతం సముద్రాల్లో ఉష్ణ తరంగాలు ఎక్కువ కాలంపాటు మరింత వేడిగా ఉంటాయి.
కానీ ఒకవేళ భూ ఉష్ణోగ్రత పెంపును పారిశ్రామిక పూర్వసగటు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పరిమితం చేయడానికి ఎస్ఏఐని ఉపయోగిస్తే సముద్రంలో నాలుగో వంతు భాగం తీవ్రమవుతున్న ఉష్ణతరంగాల నుంచి రక్షించబడుతుంది. మరింత దూకుడుగా ఉండే ప్రణాళికలో వాతావరణ మార్పులను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దే అడ్డుకుంటే 76 శాతం సముద్ర భాగాలలో ఉష్ణ తరంగాలు చల్లబడుతాయి, 80 శాతం ప్రాంతాల్లో వాటి వ్యవధి తగ్గుతుంది. దీనివల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే ప్రాంతాలు ఉష్ణమండల అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం.
14,500 కి.మీ. మేర ఉష్ణతరంగం
ఎల్నినో అనేది సహజంగా సంభవించే వాతావరణ చక్రంలో ఒక భాగం. ఇది ప్రతి రెండు నుంచి ఏడేండ్లకు ఒకసారి వేడి, చల్లని దశల మధ్య మారుతూ ఉంటుంది. ఈ చక్రంలోని ఎల్నినో భాగంలో పసిఫిక్లో పేరుకుపోయే వెచ్చని నీరు విస్తరించి భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతను పెంచుతుంది.పసిఫిక్లో ఏర్పడుతున్న భారీ సముద్ర ఉష్ణ తరంగం దీని తీవ్రతను అసాధారణంగా పెంచుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ఉష్ణతరంగం 14,500 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది 2025 చివరి నుంచి పసిఫిక్లో ఏర్పడుతున్నది. అదే సమయంలో పాపువా న్యూగినియా నుంచి కాలిఫోర్నియా తీరం వరకు విస్తరించి మరొక సముద్ర ఉష్ణతరంగం ఉన్నది.
యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన డాక్టర్ మరియానా బెర్నార్డి బిఫ్, డాక్టర్ ఫ్రాంజ్ ఫిలిప్ టుచెన్ 'బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్’ కోసం రాసిన వ్యాసంలో "ఉత్తర పసిఫిక్లో సముద్రపు నీరు ఉష్ణతరంగాల వల్ల వేడెక్కుతున్న కొద్దీ గాలులు తగ్గడం భూమధ్యరేఖను కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఎల్నినో ఏర్పడటానికి అవసరమైన పరిస్థితులను ప్రారంభించడంలో ఇటువంటి తీవ్రమైన సంఘటనలు సహాయపడుతుండవచ్చు.
భూమధ్యరేఖ వేడెక్కడం ఉత్తర పసిఫిక్ను ప్రభావితం చేస్తుంది కాబట్టి, మునుపెన్నడూ లేనివిధంగా వచ్చే 2026 ఎల్నినో ఉత్తర పసిఫిక్ సముద్రపు ఉష్ణ తరంగాల కాలవ్యవధిని మరింత పెంచవచ్చు. ఇది ప్రజలు, వన్యప్రాణులు, భూవాతావరణంపై తీవ్రమైన పరిణామాలను చూపుతుంది" అని హెచ్చరించారు. భవిష్యత్తులో మరొక సూపర్ ఎల్నినోను నిరోధించడానికి సూర్యుడిని మసకబార్చడం సహాయపడుతుందని ఈ కొత్త అధ్యయనం సూచిస్తున్నప్పటికీ, ప్రపంచ ఉద్గారాలను తగ్గించడమే కీలకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

