సూర్యాపేట : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాయి పోయి గెలుస్తామని కలలు కంటున్నాడు. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజుర్నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా కడియం వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు.
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని తెలిపారు. సైదిరెడ్డి గెలిచిన రెండు రోజులకే సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చి కోట్ల రూపాయాల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. సంవత్సరం తిరగకుండానే అభివృద్ధి పనులకు జీవోలు జారీ చేసి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉత్తమ్ కుమార్కు దమ్ముంటే హుజుర్నగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.
గతంలో హరీష్ రావు విసిరిన సవాల్కు ఉత్తమ్ పారిపోయాడు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో 3 వేల మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి 1500 ఓట్లు తెచ్చుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ ఓట్లు పడటం కూడా కష్టమేనని జగదీశ్ రెడ్డి తెలిపారు.

