- కేంద్రం ప్రతిపాదనకు రైతులు 'నో'
- నేడు 11వ విడుత చర్చలు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్కే కట్టుబడి ఉండాలని నిర్ణయించాయి. కేంద్రంతో 11వ విడుత చర్చలకు ఒక రోజు ముందు గురువారం రైతు సంఘాల నాయకులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదనలను రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా పూర్తిస్థాయి సర్వసభ్య సమావేశం తిరస్కరించింది. 'మూడు వ్యవసాయ చట్టాల రద్దు, రైతులందరికీ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చట్టం చేయాలన్న మా ఉద్యమ డిమాండ్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది' అని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య 11వ విడుత చర్చలు శుక్రవారం జరుగనున్నాయి.
ఢిల్లీ ఔటర్పైనే ట్రాక్టర్ ర్యాలీ!
ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై రైతు నేతలకు, పోలీసు అధికారులకు మధ్య గురువారం రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ర్యాలీని ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్వహిస్తామని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ గురువారం 8 రాష్ర్టాలకు చెందిన 10 రైతు సంఘాలతో చర్చించింది.

