- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల దత్తత
- సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు
- జిల్లాలోని 39 గ్రామాల గుర్తింపు
- ఈ నెలాఖరులోపు సమస్యలన్నింటికీ పరిష్కారం
వేసవి వచ్చేసింది.. ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యుత్ వినియోగం పెరగనున్నది.. పవర్ స్టేషన్లు, గ్రిడ్పై ఎక్కువ భారం పడనున్నది.. వ్యవసాయ బావుల వద్ద లో-వోల్టేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. మరోవైపు అడపా దడపా అకాల వర్షాలు కురుస్తున్నాయి.. గాలి దుమారం ధాటికి పలు చోట్ల విద్యుత్ తీగలు తెగుతున్నాయి.. విద్యుత్ స్తంభాలు నేలవాలుతున్నాయి.. ఫలితంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నది. సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. దీనిలో భాగంగా ఏఈ, ఏడీఈ, డీఈ స్థాయి అధికారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.
లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 26: వేసవిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్శాఖ సమగ్ర చర్యలు చేపట్టింది. టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు గ్రామాల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఏఈ, ఏడీఈ, డీఈ స్థాయి అధికారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుకున్నారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించనున్నారు.
సమస్యలకు పరిష్కారం..
వేలాడుతున్న 11 కేవీ, ఎల్టీ లైన్లు, ప్రమాదభరితంగా ఉండి ఒరిగిన కరెంట్ పోల్స్ను సరిచేయడం, 11కేవీ, ఎల్టీ లైన్ల మధ్యలో అవసరమైన విద్యుత్ పోల్స్ ఏర్పాటు, లైన్లలో విరిగి ప్రమాదభరితంగా ఉన్న కరెంట్ పోల్స్ మార్చడం, పాడైన ఏబీ కేబుల్స్ మార్చడం, వీధి దీపాల సర్వీసులను సంబంధించి మూడో వైర్లు, ఐదో వైర్లు లాగించడం, లోపభూయిష్ఠమైన మీటర్లను మార్చడం, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేయడం, ఎర్త్లను సరిచేయడం, విద్యుత్ సరఫరాకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
ప్రజలకు అవగాహన..
వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించే విధంగా అవగాహన కల్పించనున్నారు. టీఎస్ఎన్పీడీసీఎల్ బిల్ డెస్క్, పేటీఎం, ఫోన్పే ద్వారా బిల్లులు చెల్లించేలా ప్రోత్సహిస్తారు. గ్రామాల్లో అనధికారికంగా విద్యుత్ వాడుతున్న వ్యవసాయ మోటర్లను తొలగిస్తారు. వాటిని క్రమబద్ధీకరించుకునేలా చూస్తారు. వ్యవసాయ మోటర్లకు బిగించిన ఆటో స్టార్టర్లను తొలగిస్తారు. విద్యుత్ పంపిణీలో చోటు చేసుకునే నష్టాలను తగ్గిస్తారు. విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. టోల్ఫ్రీ నంబర్లు, విద్యుత్శాఖ అధికారుల ఫోన్ నంబర్లను అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచుతారు.
నెలాఖరులోగా పూర్తి…
గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్శాఖ 39 గ్రామాలను దత్తత తీసుకోనున్నది. టీఎస్ఎన్పీడీసీఎల్ పేర్కొన్న సమస్యలను మాత్రమే కాక స్థానికంగా గుర్తించిన సమస్యలనూ పరిష్కరించనున్నది. ఇప్పటికే విద్యుత్శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నారు. కొత్తగూడెం డివిజన్లో 28 గ్రామాలు, భద్రాచలం డివిజన్లో 11 గ్రామాలను దత్తత తీసుకోనున్నారు.

3

