Dailyhunt
విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం..ఏడుగురు కరోనా రోగులు మృతి

విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం..ఏడుగురు కరోనా రోగులు మృతి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కొవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 30 మంది కొవిడ్‌ బాధితులు, మరో 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దట్టంగా పొగలు అలుముకోవడంతో.. శ్వాస తీసుకోవడంలో బాధితులకు ఇబ్బందులు తలెత్తాయి.

బాధితులందరినీ లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు పోలీసులు.

హోటల్‌లో మంటలు చెలరేగే సరికి అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. కరోనా బాధితులను కాపాడేందుకు పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తమను రక్షించండి అంటూ బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana