న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన గణతంత్ర పరేడ్లో ట్రాక్టర్ కింద పడి మరణించిన రైతు.. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా వాసి. ఇటీవలే ఆస్ట్రేలియాలో పెండ్లి చేసుకున్న సదరు రైతు నవ్రీత్ సింగ్ (27).. వివాహ విందులో పాల్గొనేందుకు భారత్కు వచ్చాడు. అత్తింటి వారిని పలకరించిన తర్వాత మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లాడు.
ఐటీవో వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించడానికి నవ్రీత్సింగ్ హైస్పీడ్లో నడుపడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. దాని కింద పడిన నవ్రీత్సింగ్ మరణించాడని పోలీసులు చెప్పారు. తామంతా కలిసి ర్యాలీలో పాల్గొన్నామని, కానీ ఏం జరిగిందో తెలియదని నవ్రీత్సింగ్ పొరుగింటి వ్యక్తి తెలిపారు.
అంతకుముందు ఐటీవో వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లోనే ఆయన మరణించాడన్న పుకార్లు కార్చిచ్చులా వ్యాపించాయి. కానీ అతడికి బుల్లెట్ తగిలిన ద్రుశ్యాలేవీ సీసీటీవీ కెమెరాలో లభించలేదని పోలీసులు ప్రకటించారు.
పోస్ట్మార్టం ముగిసిన తర్వాత పోలీసులు మంగళవారం రాత్రి నవ్రీత్సింగ్ మ్రుతదేహాన్ని బిలాస్పూర్ ప్రాంతం దిబ్దిబా గ్రామంలోని ఆయన కుటుంబానికి అప్పగించారు. వివాహ విందు కోసం వచ్చి నవ్రీత్సింగ్ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా నవ్రీత్సింగ్కు నివాళులు అర్పించేందుకు బుధవారం బారులు తీరారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

