
చండీగఢ్ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. టిక్రి బోర్డర్లో నిరసనలు జరుగుతున్న చోటు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని హర్యానాలోని హిసార్ జిల్లా సిసాయి గ్రామానికి చెందిన రైతు (49) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న బాధిత రైతును రాజ్వీర్ సింగ్గా గుర్తించారు. రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు.
తన త్యాగం వృధా కాకుండా పోరుబాటలో ముందుకు సాగాలని బాధిత రైతు విడిచిపెట్టిన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని బహదూర్గఢ్ పోలీస్ స్టేషన్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసి మద్దతు ధరకు భరోసా కల్పిస్తేనే నిరసనల నుంచి వైదొలగాలని బాధిత రైతు కోరాడని చెప్పారు. మరోవైపు హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన మరో రైతు (52) కూడా చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా మారాడని పోలీసులు తెలిపారు.