Dailyhunt
WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!

WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!

న్యూఢిల్లీ: ఈ నెల ఆఖరి వారంలో ఐదు రోజులపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆన్‌లైన్ దావోస్ ఎజెండా సమ్మిట్ జరుగనుంది. జనవరి 25-29 వరకు జరుగనున్న ఈ సదస్సులో వివిధ దేశాధినేతలతోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 28న సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం ఉన్నది. ప్రధాని మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా WEF ఆన్‌లైన్‌ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

భారత్ నుంచి ప్రధానితోపాటు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్‌, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయెల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, బడా వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు ఈ WEF సదస్సులో పాల్గొననున్నారు.

సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌తోపాటుగా జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌, జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్‌, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌, ఇటలీ ప్రధాని గిసెప్పే కాంటే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌, ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు పాల్గొననున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana