- టీయుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
104 ఫిక్స్ డే హెల్త్ సర్వీసులను యధావిధిగా కొనసాగిస్తూ పని చేస్తున్న డ్రైవర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులతో పాటు ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో 104 ఉద్యోగుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ మాట్లాడుతూ, 104 సిబ్బంది రోగులకు ఇంటి వద్దనే వైద్యసేవలందించడంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని గుర్తుచేశారు.
వారు మారుమూల, గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుకు బీపీ, షుగర్ తదితర జబ్బులకు రెగ్యులర్గా మందులు అందిస్తున్నారని తెలిపారు.2007 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎంఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో 104 ఫిక్స్ డ్ డే హెల్త్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయనీ, 2010లో యూనియన్ పోరాట ఫలితంగా హెచ్యంఆర్ఐ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి వాహనాలు మరియు సిబ్బంది మారారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 195 వాహనాల్లో 1375 మంది వివిధ క్యాడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, వీరికి గత 14 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయకపోవడంతో దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలక్రమేణా వాహనాలు రిపేరుకు వచ్చినా ప్రభుత్వం నిధులు కేటాయించక, మరమ్మతులు చేయించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దీంతో అన్ని గ్రామాలకు సర్వీసులను నడపలేకపోతున్నారని చెప్పారు. దీంతో ఈ సేవల మీద ఆధారపడ్డ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే వాహనలకు మరమ్మతులు చేయించి, అన్ని గ్రామాలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బలరాం, విజయవర్దన్ రాజు, ఫసీయేద్దీన్, మరియ, కవిత, హరిశంకర్, శ్రీనివాస్, నవీన్, మతీన్, మల్లేశ్, అనిల్, రామారావు, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.
