Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
20 లక్ష‍ల ఇండ్లు కట్టిస్తేనే ఓట్లడగాలి

20 లక్ష‍ల ఇండ్లు కట్టిస్తేనే ఓట్లడగాలి

మాట నిలబెట్టుకునే దమ్ముందా?శపథాలు కాదు చేసి చూపించు
మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో 20 లక్షల ఇండ్లు కట్టిస్తేనే ప్రజలను ఓట్లు అడగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టాకే ఓట్లు అడుగుతామని సవాల్ చేసిన మంత్రి పొంగులేటికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శపథాలు చేయడం కాదనీ, చాతనైతే చేసి చూపించాలని కోరారు. దమ్ముంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనాలని సవాల్ విసిరారు. తాము కట్టిన ఒక్కో డబుల్ డెడ్రూంకు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని పేర్కొన్నారు. వారికి చిత్తశుద్ధి, సత్తా ఉంటే తాము కట్టిన వాటికి మించి హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టాలని డిమాండ్ చేశారు. తాము ఇండ్లు కడితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతున్నదని విమర్శిం చారు. గత రెండున్నర ఏండ్లలో హైదరాబాద్ నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టిన ఇండ్లు ఎన్ని? అనే దానిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా?అని ప్రశ్నించారు. దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సు మనిపించిన 'తుపేల్ మినిస్టర్', 'మిస్టర్ బాంబులేటి' అని ఎద్దేవా చేశారు.

పొంగులేటి మాదిరి కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకుని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను బుక్క పట్టడం తమకు తెలియని తెలిపారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియవని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం కూడా తమకు తెలియదని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఆత్మగౌరవ గృహాలు కట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత తమదేనని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana