Dailyhunt
2060 నాటికి జీరో స్థాయికి కర్బన ఉద్గారాలు

2060 నాటికి జీరో స్థాయికి కర్బన ఉద్గారాలు

- వాతావరణమార్పులపై సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌
వాషింగ్టన్‌: వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2060 వ సంవత్సరం నాటికల్లా జీరో స్థాయికి తీసుకొస్తామని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. మనిషికి, ప్రకృతికి మధ్య సామరస్య సంబంధాలు నెలకొనేలా చూడడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌ హౌస్‌ నుంచి గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ శిలాజ ఇంధనాల నుంచి సుస్థిర ఇంధనాలవైపు చైనా మళ్లుతుందని తాము గతంలో ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.

అంతకు ముందు ఐరాస చీఫ్‌ ఆంటోని గుటెరస్‌ ఈ సదస్సులో 'నెట్‌ జీరో క్లైమేట్‌ కొయిలేషన్‌' ను ఎలా నిర్మించాలో ఆలోచించాలని కోరారు. కర్బన ఉద్గారాలను దశలవారీగా తగ్గించుకోవడం ద్వారా ప్రకృతిపై యుద్ధానికి చరమ గీతం పాడాలని ఆయన కోరారు. నేడు ప్రపంచం ఓ అగాథపుటంచుల్లో ఉంది. ఇది నిర్ణయాత్మ దశాబ్ది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana