హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా మద్రాస్ హైకోర్ట్ కు తాళం పడింది. ఇలా మద్రాస్ హైకోర్ట్ కు తాళం పడటం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో ఇంటి నుంచే కేసుల విచారణపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం ఆన్లైన్ విచారణలకు ప్రత్యేక బెంచ్లను కూడా ఏర్పాటు చేశారు. హైకోర్ట్ లోని ముగ్గురు న్యాయమూర్తులు, పలువురు సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం, మరికొందరు న్యాయమూర్తులకు పరిశోధన నివేదికలు రావాల్సి ఉండడం వలన హైకోర్టుకు తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయమూర్తులకు కరోనా నిర్ధారణ కావటంతో హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానంతరం హైకోర్టుకు తాళం వేయడానికి నిర్ణయించారు.
హైకోర్టుకు న్యాయవాదులు, సిబ్బంది ఇక రావద్దు అని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. కాగా బెంచ్లకు నియమించిన న్యాయమూర్తులు వారి వారి ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టనున్నారు.

