రానా దగ్గుబాటి ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్కు మంచి స్పందన అందుకున్న 'థ్యాంక్ యు బ్రదర్' టీమ్, ఇప్పుడు క్యాస్ట్ రివీల్ పోస్టర్తో ముందుకొచ్చింది. ఈ పోస్టర్ను యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు.
ఈ పోస్టర్లో ఒక లిఫ్ట్లో ప్రధాన పాత్రధారి అనసూయ భరద్వాజ్ ప్రెగెంట్ లుక్లో, చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకుని కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంటే, ఆమె వెనకే మరో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్లో నిలబడి కనిపిస్తున్నారు. వీరు నిల్చున్న విధానం, పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే, ఇద్దరికీ ఏదో గొడవ జరిగిందని చెప్పకనే చెబుతోంది. ఉత్కంఠభరిత అంశాలతో డ్రామా చిత్రంగా 'థ్యాంక్ యు బ్రదర్'ను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు.
జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

