నవతెలంగాణ-వనపర్తి: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులను సందర్శించి తనిఖీ చేశారు. మొదట పట్టణంలోని మర్రికుంట పాల కేంద్రం వెనుక నిర్మిస్తున్న నీటి ట్యాంకును పరిశీలించారు. ప్రస్తుతం వనపర్తి పట్టణంలో ఎన్ని నీటి ట్యాంకులు ఉన్నాయని వాటి సామర్థ్యం ఎంత అని కలెక్టర్ ఆరా తీశారు. పబ్లిక్ హెల్త్ డి ఈ స్పందిస్తూ ప్రస్తుతం వనపర్తి పట్టణంలో 6.5 ఎం ఎల్ డి సామర్థ్యంతో 30 వాటర్ ట్యాంకులు ఉన్నాయని చెప్పారు. ఇంకా పట్టణానికి అదనంగా 5.5 ఎం ఎల్ డి సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకులు అవసరం ఉన్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమృత్ పథకంలో భాగంగా 8 ట్యాంకులు మంజూరైనట్లు, వాటిలో 5 ట్యాంకుల పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని తెలిపారు.

