Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత..

భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత..

వతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్, మ్యాడ్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.

సోమశేఖర్ (సోమా) (59) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. ఆయన మరణ వార్త తెలియగానే సిలికాన్ వ్యాలీ నుంచి సియాటెల్ వరకు టెక్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. వేలాది మంది ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లకు మార్గదర్శిగా నిలిచిన ఆయనకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

సోమశేఖర్ సుమారు 27 సంవత్సరాలు మైక్రోసాఫ్ట్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కంపెనీ డెవలపర్ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర. విండోస్ ఎన్టీ ప్రాజెక్టులో పనిచేయడమే కాకుండా, విజువల్ స్టూడియో, .నెట్ (.NET) వంటి ఉత్పత్తులకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా 1998లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ స్థాపనలో ఆయన పోషించిన పాత్ర ఎంతో విశిష్టమైనది. ఈ కేంద్రం ద్వారా ఎంతో మంది భారతీయ ఇంజనీర్లకు అవకాశాలు లభించాయి.

2015లో మైక్రోసాఫ్ట్ను వీడిన సోమశేఖర్, ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ మ్యాడ్రోనా వెంచర్ గ్రూప్లో చేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లోని స్టార్టప్లను ప్రోత్సహించారు. ఆయన సెప్టెంబర్ 2024 నుంచి ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ యూఐపాత్ (UiPath) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా కూడా సేవలు అందించారు.

'సోమశేఖర్ మా జీవితాలను మార్చేసిన గురువు. ఆయన లేనిదే మాకు ఈ స్థాయి ఉండేది కాదు' అంటూ వైట్హౌస్ ఏఐ సలహాదారు, వ్యాపారవేత్త శ్రీరామ్ కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమశేఖర్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేసేవారని, ఎంతో మందిని కేవలం తన ప్రోత్సాహంతోనే ఉన్నత స్థాయికి చేర్చారని ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీటీఓ విజయీ రాజ్ గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సోమశేఖర్, అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి టెక్నాలజీ రంగంలో శిఖర స్థాయికి చేరుకున్నారు. ఆయన సియాటెల్ ఓర్కాస్ క్రికెట్ ఫ్రాంచైజీతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన మృతి టెక్ ప్రపంచానికి తీరని లోటుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana