- పోచారం ప్రాజెక్టులో మృతదేహాలు లభ్యం
నవతెలంగాణ- నాగిరెడ్డిపేట్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో దంపతుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. కాగా, వారు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ప్రమాదవశాత్తు పడిపోయారా అనేది విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఎస్ఐ రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన మహేందర్(22)కు, నాగిరెడ్డిపేట్ మండలంలోని బెజుగంచెరువు తండా పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన శిరీష(22)తో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహం అయింది. అయితే, బుధవారం ఎర్రకుంటకు వచ్చిన శిరీషను మహేందర్ వచ్చి తీసుకెళ్లాడు.
రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో గురువారం కుటుంబీకులు చుట్టుపక్కల గాలించారు. పోచారం ప్రాజెక్టు వద్ద చెప్పులు, ద్విచక్ర వాహనం కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ రాజయ్య ఘటనా స్థలానికి వెళ్లి జాలర్ల సహాయంతో వెతికించారు.
మృతదేహాలను బయటకు తీయించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. వారి మృతికి కారణాలు తెలియలేదు. ఆత్మహత్యనా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
