- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- నల్లగొండ, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ జీవో 131, 135లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ధర్నాలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ధర్నాలో జూలకంటి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెగ్యులరైజేషన్ రూల్స్ సామాన్య ప్రజలకు పెను భారంగా మారాయన్నారు.
క్రమబద్ధీకరణ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్ చేయబోమని, నల్లా, డ్రయినేజీ కనెక్షన్లు, రోడ్డు తదితర సౌకర్యాలు కల్పించబోమని బెదిరించడం సరికాదన్నారు. కరోనా, లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆదాయం లేక జనం విలవిల్లాడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారాలు మోపడం ఏంటని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ను బలవంతంగా ప్రజలపై రుద్దితే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మల్లు నాగార్జున్రెడ్డి పాల్గొన్నారు.

