నవతెలంగాణ - భువనగిరి : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్ పి ఆర్ డి ) ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు తమ నివాసాలలో వేరువేరుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన కోసం మరియు వారి సమస్యల పరిష్కార మార్గాల కోసం యాదగిరిగుట్టలో నిర్వహించబోయే ఈ రాష్ట్ర సదస్సుకు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దివ్యాంగుల హక్కుల రక్షణకు, వారి సమస్యల వైపు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి ఈ మూడు రోజుల రాష్ట్ర సదస్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ సదస్సును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు.
ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షులు కే. వెంకట్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడవయ్య , యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత ముఖ్య నాయకులు పాండాల శ్రీహరి, చల్లగురుగులరఘుబాబు, గంగాధరి వెంకటేష్ పాల్గొన్నారు.

