అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఇప్పటికే సిద్ధమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. శుక్రవారం సాయంత్రం ఊహించని విధంగా జగన్ సర్కారుకు షాకిచ్చారు. ఏకంగా 9 మంది ఉన్నతాధికారులను ఎన్నికల విధుల నుంచి దూరం చేసేలా పావులు కదిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి ఇద్దరు కలెక్టర్లు సహా 9 మంది ఉన్నతాధికారులను తొలగించాలని సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ రమేష్ సూచించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ కోరారు.
ఆయా స్థానాల్లో మూడేసి చొప్పున పేర్లను ప్రతిపాదించాలని సీఎస్, డీజీపీని లేఖలో ఎస్ఈసీ కోరారు. దీంతో నిమ్మగడ్డ ఆదేశాలపై జగన్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఆసక్తి నెలకొంది. కాగా, ఇప్పటికే ఎన్నికల కమిషన్లోని అధికారులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

