హైదరాబాద్: మురుగునీటి వ్యవస్థ ప్రణాళికపై టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తలసాని మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండటం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అదృష్టమన్నారు. 'ఏ నగరంలో అయినా మురుగునీటి వ్యవస్థ చాలా కీలకమైనది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించాం.
ఇప్పుడున్న 25 ఎస్టీపీలకు అదనంగా మరో 31 ఎస్టీపీలను రెండేళ్లలో నిర్మిస్తాం. రాబోయే కాలంలో తాగునీటి, మురుగునీటి సమస్యలు తీర్చేలా చర్యలకు సిద్ధమయ్యాం. ప్రతి నియోజకవర్గానికి నాలుగు ఎయిర్టెక్ మిషినరీని ఏర్పాటు చేశాం. మురుగునీటి శుద్ధికోసం రోబోటిక్ పరిజ్ఞానం అవలంబిస్తాం.
యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. హెచ్ఎండీఏ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి, విస్తరణ జరుగుతోంది. హైదరాబాద్ నగర ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయి అని తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.

