Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్వెస్ట్ తెలంగాణ

ఇన్వెస్ట్ తెలంగాణ

పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుఎస్కార్ట్ ఆఫీసర్గా 
గ్రూప్-1 అధికారి
తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాల అధ్యయనం
బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ

డేటా సిటీ కోసం 
1,500 ఎకరాలు
ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, 
జర్నలిస్ట్ లకు 500 ఎకరాలు
భారత్ ఫ్యూచర్ సిటీలో 
భూ కేటాయింపులు, 
పరిశ్రమల ఏర్పాటుపై 
సీఎం రేవంత్రెడ్డి సమీక్ష‍

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ర్టంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని సీఎం ఏ రేవంత్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక వెబ్సైట్, లోగోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఇన్వెస్ట్ తెలంగాణ ప్రత్యేక కార్యాలయాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసి, దానికి గ్రూప్-1 అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్గా నియమించాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్ రాష్ర్టాల్లోని పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేసి, తెలంగాణ పాలసీని అంతకంటే మెరుగ్గా, ఆకర్షణీయంగా రూపొందించాలని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటుపై బుధవారం నాడిక్కడి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని బోధి పెవిలియన్లో సమీక్ష‍ా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వైస్ చైర్మెన్ శశాంక్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటు కు శంకుస్థాపన జరిగేలా చూడాలని చెప్పారు.

భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని సూచించారు. నెట్ జీరో సిటీ తరహా లోనే డిజైన్లు ఉండాలనీ, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఉండాలని చెప్పారు. దీనిలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారుల్ని హెచ్చరించారు. దీనికోసం అవసరమైతే అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ స్థాయి సంస్థలను తీసుకురావాలనీ, దీనికోసం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. అయితే ఫ్యూచర్సిటీలో తొలుత ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనీ, ఆ తర్వాతే భూ కేటాయింపులు చేయాలని సూచించారు. 1,500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలనీ, వాటి నీటి అవసరాలకోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీ)లు వినియోగించు కోవాలని చెప్పారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను ఫ్యూచర్ సిటీ కి వచ్చేలా చర్య లు తీసుకోవాలనీ, దీనికోసం అవసరమైతే ప్రధాని మోడీని కలిసి హెల్త్ క్లస్టర్ కోసం ప్రత్యేక
విజ్ఞప్తి చేద్దామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీలోనే ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలోని ప్రభుత్వ భూముల్ని గుర్తించాలని ఆదేశించారు. ఈ కేంద్రాలు సాధ్యమైనం తగా ద్వితీయ శ్రేణి నగరాలల్లో ఏర్పాటయ్యేలా విధాన రూపకల్పన చేయాలని చెప్పారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూడు నెలల్లో టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందేననీ, దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టంచేశారు. హైదరాబాద్ పురోగతిని మార్చే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు పరిశ్రమల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ర్టంలో పారిశ్రామిక పురోగతి, ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతలను వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana