నవతెలంగాణ - హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో దీనికి ఫాలోవర్లు రోజురోజుకూ పెరుగుతున్నారు.
సంచలనంగా మారిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు. అనధికార పొలిటికల్ క్యాంపెయిన్ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ఖాతాను నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు.
'ఎక్స్' ఖాతాను నిలిపివేసే సమయానికి సుమారు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు, కేవలం 4 రోజుల్లోనే సీజేపీ ఇన్స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో కావడం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్ సైట్ను కూడా ప్రారంభించారు. కొంతమంది యువకులను బొద్దింకలతో పోలుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

