నవతెలంగాణ-హైదరాబాద్: కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయు(CENTRE OF INDIAN TRADE UNIONS) డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. 14 ఏండ్ల తర్వాత కనీస వేతనాలను సవరించడం అభినందనీయమని, ఈ పెంపుతో కోటి 11లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేసింది. కానీ పెంపు విషయంలో శాస్త్రీయత లోపించిందని, అశాస్త్రీయంగా వేతనాలను సవరించారని సీఐటీయు విమర్శించింది. వేతనాలను 4 క్యాటగీరీలుగా విభజించి అన్ని రంగాల్లో ఒకేరీతిలో వేతనాలు పెంచడంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురువుతాయని సూచించింది. అదే విధంగా కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం కార్మికులను ఆందోళన కల్పిస్తుందని విమర్శించింది.
పెరిగిన ధరలు, 1948 కనీస వేతన చట్టం, సుప్రీం తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు, శాస్త్రీయంగా లెక్కిస్తే రూ.32000లు వస్తుంది. అయినప్పటికి కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26వేలు ఉండాలని డిమాండ్ చేసిందని పేర్కొంది. కార్మిక సంఘాల డిమాండ్లలను పరిగణనలోకి తీసుకొని పెంచిన వేతనాలను ప్రభుత్వం సవరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

