Dailyhunt
కొడుకుతో కలిసి

కొడుకుతో కలిసి

ప్రియుడిని హతమార్చిన మహిళ మటన్ కొట్టే కత్తితో హత్య
మూటగట్టి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ అంబేడ్కర్ నగర్లో ఒక దారుణ హత్య కలకలం రేపింది.

పదేండ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడిని మహిళ తన కొడుకుతో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి(40) చింతల్లోని అంబేడ్కర్నగర్లో అరుణ అనే మహిళతో పదేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు.

ఆ మహిళ కుమారుడు సాయి రత్న కూడా వీరితోనే ఉంటున్నాడు. అయితే.. కొంతకాలంగా శివారెడ్డి ఆ మహిళను, ఆమె కుమారుడిని తీవ్రంగా వేధిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు జరుగుతుండేవి.

వేధింపులు భరించలేక బాధిత మహిళ, ఆమె కుమారుడు కలిసి అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. ఆదివారం రాత్రి గొడవ జరగ్గా.. మటన్ కొట్టే కత్తితో శివారెడ్డిని తల్లీకొడుకు కలిసి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఒక సంచిలో మూటకట్టి బయట ఎక్కడైనా పారేయాలని అర్ధరాత్రి ప్రయత్నిస్తుండగా గస్తీలో ఉన్న జీడిమెట్ల పోలీసులు వారిని గమనించారు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా సంచిలో రక్తంతో ఉన్న మృతదేహం కనిపించింది. తల్లిని, కుమారుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana