Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగిసిన ఎస్ఐఆర్ గడువు

ముగిసిన ఎస్ఐఆర్ గడువు

- భద్రాద్రి జిల్లాలో 100 శాతం డిజిటైజేషన్ పూర్తి- అశ్వారావుపేటలో అత్యధికంగా 90.36 శాతం సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలు
- జిల్లాలో 13.34 శాతం ఫారాలు సేకరించలేకపోయినట్లు నివేదిక

నవతెలంగాణ - అశ్వారావుపేట
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువు సోమవారం ముగిసింది. గడువు ముగిసే సమయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేకరించిన ఫారాలు, సేకరించలేని ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను అధికారులు 100 శాతం పూర్తి చేశారు.

జిల్లాలో మొత్తం 9,96,198 మంది ఓటర్లు ఉండగా, 8,63,314 మంది (86.66 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. మరో 1,32,884 మంది (13.34 శాతం) ఫారాలు సేకరించలేని విభాగంలో నమోదు చేయబడ్డాయి. దీంతో మొత్తం ఓటర్ల వివరాల డిజిటైజేషన్ 100 శాతం పూర్తయినట్లు జిల్లా నివేదిక వెల్లడించింది.

ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అశ్వారావుపేట (ఎస్టీ) నియోజకవర్గం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొత్తం 1,60,221 మంది ఓటర్లలో 1,44,772 మంది (90.36 శాతం) ఫారాలు డిజిటైజ్ కాగా, కేవలం 9.64 శాతం మాత్రమే సేకరించలేని విభాగంలో ఉన్నాయి.

మిగిలిన నియోజకవర్గాల్లో భద్రాచలం 87.02 శాతం, కొత్తగూడెం 86.23 శాతం, పినపాక 85.44 శాతం, ఇల్లందు 85.39 శాతం డిజిటైజేషన్ నమోదు చేశాయి.

నివేదిక ప్రకారం జిల్లాలో డిజిటైజ్ చేయాల్సిన ఒక్క ఫారం కూడా పెండింగ్లో లేదు. అలాగే బీఎల్వో ధృవీకరణ లేకుండా ఓటర్లు నేరుగా సమర్పించిన ఫారాలు కేవలం 8 మాత్రమే నమోదయ్యాయి. అందులో పినపాక - 3, కొత్తగూడెం - 3, భద్రాచలం - 2 ఉండగా, అశ్వారావుపేట,ఇల్లందు నియోజకవర్గాల్లో అలాంటి ఫారాలు ఏవీ లేవు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాల సేకరణ గడువు ముగియడంతో ఎన్నికల సంఘం తదుపరి దశలో ముసాయిదా ఓటరు జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) విడుదల, అభ్యంతరాలు - దావాల స్వీకరణ ప్రక్రియను చేపట్టనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana