- గిరిజన బాలుర హాస్టల్ విద్యార్థుల ర్యాలీనవతెలంగాణ - అశ్వారావుపేట
దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ మురహరి రఘు విద్యార్థులకు మద్దతుగా నిలిచి హాస్టల్ లో నెలకొన్న నీటి సమస్యను డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్ లో ఇప్పటివరకు బోరు మోటార్ లేకపోవడంతో వీధి కుళాయిలపైనే ఆధారపడి రోజువారీ అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. దీనికితోడు గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
విద్యార్థుల సమస్యలపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ వెంటనే ఆర్డబ్ల్యూఎస్ జేఈ, హాస్టల్ వార్డెన్ను పిలిపించారు. సమస్య తీవ్రతను పరిశీలించి, హాస్టల్కు బోరు మోటార్ మంజూరు చేశారు. దీంతో నీటి సమస్యకు పరిష్కారం లభించడంపై విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.

