Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటరు నమోదుకు అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలి

ఓటరు నమోదుకు అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలి

- మాజీ మంత్రి, బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్లో తహసీల్దార్ సమక్షంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) తన వ్యక్తిగత ఓటరు వివరాలను ఆయన స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు.నియోజకవర్గ ప్రజలందరు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా సర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని సూచించారు.

ఈ సందర్బంగా అధికారులకు, బూత్ లెవెల్ అధికారులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్లో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఈ నెల 23వ తేదీ లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి వారికీ ఇవ్వాలన్నారు. మొత్తం రెండు ఫారాలు ఉంటాయని, ఒకటి బీఎల్ఓకు అందజేసి, అధికారుల సంతకం ఉన్న మరో ఫారాన్ని (రసీదు) ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫారాలు నింపి, అధికారులకు సమర్పించకపోయినా, ఆన్లైన్లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కోరారు.

ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు, బూత్ లెవల్ అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు జారీ చేశారు. బీఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గుడులు లేదా సంఘం భవనాల్లో ఒకే దగ్గర కూర్చుని వివరాలు రాయడం సరికాదన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ స్వయంగా వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు ఒకే దగ్గర కూర్చుని పనిచేస్తే ప్రజల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి, ఓటర్లను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించిన తర్వాతే ఆఫీసులో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.

ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లలపై ఉందన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లే సమయంలో ఏజెంట్లు కూడా వారితో పాటు వెళ్లి, ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరితో ఓటరు వివరాలు నమోదు చేయించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వేల్పూర్ మండల తహసిల్దార్ అనిరుద్, బూత్ లెవెల్ అధికారులు, సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana