Dailyhunt
పౌల్ట్రీ రంగానికి సోయా చిక్కులు!

పౌల్ట్రీ రంగానికి సోయా చిక్కులు!

- రూ.10వేలు దాటిన క్వింటా సోయాబీన్స్‌
న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లో సోయాబీన్స్‌ ధరలు రికార్డు స్థాయిలో నమోదుకావటం పౌల్ట్రీరంగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రొటీన్‌ పెద్దమొత్తంలో ఉండే సోయాబీన్స్‌ను చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమలో దాణాగా వాడతారు. సోయాబీన్స్‌ వాడిన దాన్నిబట్టే కోళ్ల ఎదుగుదల, గుడ్ల సంఖ్య ఆధారపడి ఉంటుందని, మార్కెట్లో క్వింటా సోయాబీన్స్‌ రూ.10వేలు (ఇండోర్‌ మార్కెట్లో) దాటడంతో నిర్వహణ వ్యయం పెరిగిపోయిందని పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సోయాబీన్స్‌ దిగుమతులపై కేంద్రం కస్టం సుంకం తగ్గిస్తేనే ధరలు తగ్గుముఖం పడతాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

దాణా ఖర్చులు పెరగటం వల్లే చికెన్‌, గుడ్ల ధరలు పెరిగాయని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేశాక చికెన్‌, గుడ్లకు డిమాండ్‌ పెరిగింది. హోటెల్స్‌, రెస్టారెంట్స్‌ తెరుచుకోవటంతో చికెన్‌ కొనుగోళ్లు పుంజుకున్నాయి. గత కొన్ని నెలలుగా సోయాబీన్స్‌ కొనుగోళ్ల కోసం పౌల్ట్రీ పరిశ్రమ దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా గోడౌన్లలో సోయాబీన్స్‌ పెద్దమొత్తంలో నిల్వలున్నా, దిగుమతుల కోసం వేచిచూడాల్సి వస్తోందని సమాచారం. దిగుమతులపై కేంద్రం కస్టమ్స్‌ సుంకం భారీగా విధించటం వల్ల సోయా కొనుగోళ్లు భారంగా మారాయి. కమోడేటివ్‌ మార్కెట్లో సోయా ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ అధిక ధరలతో నమోదుకావటంపై సోయాబీన్‌ పరిశ్రమదారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana