Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు - రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి
- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- వెంకమ్మ చెరువు వరద కాలువను పరిశీలించిన ఇరువురు ప్రజాప్రతినిధులు

- రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
నవతెలంగాణ - అశ్వారావుపేట

మండలంలోని రామన్నగూడెం గ్రామ పరిధిలో ఉన్న వెంకమ్మ చెరువు వరద కాలువను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువు భద్రత, వరద నీటి ప్రవాహం, కాలువ సామర్థ్యం, రైతులకు కలిగే ప్రయోజనాలపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో చెరువులో నీటి నిల్వలు పెరగడంతో వరద కాలువ సక్రమంగా పనిచేస్తుందా అనే అంశాన్ని మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలువ వెడల్పు, లోతు, నీటి ప్రవాహ మార్గం, ఆక్రమణలు లేదా ఇతర అవరోధాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించడం, నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న చెట్లు, పొదలను తొలగించడం, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడం వంటి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.సాగునీటి వనరుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, కాలువల ఆధునీకరణ ద్వారా గ్రామీణ వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల సమయంలో గ్రామాలు, పంట పొలాలకు ఎలాంటి నష్టం జరగకుండా వరద కాలువలు సమర్థవంతంగా ఉండేలా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. చెరువుల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీరు, పశువులకు తాగునీరు అందుబాటులో ఉంటుందని వివరించారు.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. చెరువులు, కాలువలు, సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వెంకమ్మ చెరువు వరద కాలువ బలోపేతం కావడం ద్వారా రామన్నగూడెం సహా పరిసర గ్రామాల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

పరిశీలన సందర్భంగా స్థానిక రైతులు, గ్రామస్తులు వర్షాకాలంలో నీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో పూడిక తొలగింపు, కాలువ విస్తరణ అవసరమని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ప్రడీవో మధు బాబు, తహశీల్దార్ దాసరి కిశోర్,జాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతు నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana