హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నగరంలోని బొరివలీ సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన షాపింగ్ కాంప్లెక్స్ సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది.. 14 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం.. అదే సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున షాపులు అగ్నికి ఆహుతయ్యాయని..
వీటి నష్టం ఇంకా తెలియరాలేదన్నారు. మొత్తానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

