క్యూబా విప్లవానికి గుండెకాయ లాంటి క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ (పీసీసీి)ఎనిమిదో మహాసభ ఇటీవల హవానాలో విజయవంతంగా ముగిసింది. ప్రతి అయిదేండ్లకొకసారి జరిగే ఈ మహాసభ రానున్న అయిదేండ్ల కాలానికి పార్టీకి, దేశానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో కీలక భూమిక వహిస్తుంది. ఆ రీత్యా పీసీసీ ఎనిమిదో మహాసభ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోబాటు ఈ మహాసభ కొన్ని ప్రత్యేకతలను కూడా కలిగివుంది. 1959లో బటిస్టా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సారథ్యం వహించిన విప్లవనేత, ఇరవయ్యో శతాబ్దంలో చరిత్రను మలుపు తిప్పిన విప్లవ యోధుడు ఫైడెల్ కాస్ట్రో లేకుండా జరిగిన తొలి మహాసభ ఇది. 1953లో మోంకాడ్ బ్యారక్పై సోదరుడు ఫైడెల్ కాస్ట్రోతో కలసి సాయుధ తిరుగుబాటు చేయడం ద్వారా తొలిసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రావుల్ కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి విరమించుకోవడం, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ బదలాయింపు చారిత్రిక తరం నుంచి కొత్త తరానికి సాఫీగా సాగిపోవడం ఈ మహాసభ మరో ప్రత్యేకత.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి క్యూబాపైనా పంజా విసిరింది. అమెరికా ఆర్థిక దిగ్బంధనం, లాటిన్ అమెరికాలో మితవాద శక్తులు తిరిగి తలెత్తడం వంటి పరిణామాలు క్యూబాను ఆర్థికంగా, రాజకీయంగా మరిన్ని ఇబ్బందులకు గురిచేశాయి. ఉన్న పరిమిత వనరులతోనే ప్రగతిసాధించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించడం నూతన నాయకత్వ సామర్థ్యానికి ఒక పెద్ద పరీక్ష. కరోనా వల్ల ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం ఇప్పటికే చాలావరకు దెబ్బతినిపోయింది. పార్టీ నాయకత్వంలో అత్యధిక శాతం మంది క్యూబా విప్లవం తరువాత పుట్టినవారే. ఈ రీత్యా పార్టీ క్యాడర్ను సైద్ధాంతికంగా, రాజకీయంగా పటిష్టపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. క్యూబాను అస్థిరపరిచేందుకు విచ్ఛిన్నకర శక్తులను నిరంతరం ఎగదోస్తున్న అమెరికా కుతంత్రాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని మహాసభ హెచ్చరించింది. 2019లో రాజ్యాంగంలో తెచ్చిన మార్పులను అమలు చేయడంలోను, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొత్తతరం నాయకత్వానికి పరీక్షే. క్యూబా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణం పట్ల పార్టీ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, నిరంతర అభివృద్ధిపై వారిలో విశ్వాసం కల్పించేందుకు ప్రభుత్వం, పార్టీ నిబద్ధతతో కృషి చేయాలని, స్వయం ఉపాధి, ఉత్పాదక రంగాల్లో భాగస్వామ్యం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మహాసభ ఉద్ఘాటించింది. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిరంతర శోధన ద్వారా క్యూబా ప్రజలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నూతన నాయకత్వ భుజస్కంధాలపై ఉంది.
