- రాయిచెడులో ఘనంగా వర్ధంతి సభనవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో మంగళవారం సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దేశ్యా నాయక్ మాట్లాడుతూ.. సుందరయ్య స్ఫూర్తితో సమ సమాజ నిర్మాణం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. సామాజిక అసమానతల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు సుందరయ్య అని కొనియాడారు. దేశంలో తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలీలు, పేదల హక్కుల కోసం భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సుందరయ్య నిరాడంబర జీవనానికి ప్రతీక అని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు శివకుమార్, బి.రాములు, గొడుగు వెంకటయ్య, రామకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

