హైదరాబాద్: హోర్డింగ్లలో ప్రధానమంత్రి ఫొటోను ఉపయోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను 72 గంటల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్ల నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెట్రోల్ పంప్ డీలర్లతో పాటు, ఇతర ఏజెన్సీలను ఆదేశించింది. ఈ విషయమై టీఎంసీ ప్రతినిధుల బృందం ఎన్నికల అధికారులను కలిసి వివిధ కేంద్ర పథకాలు, హోర్డింగ్లలో ప్రధాని ఫొటోల వినియోగంపై అభ్యంతరం తెలిపారు. గత నెల 26న రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎనిమిది విడుతల్లో బెంగాల్ ఎన్నికలు జరుగనున్నాయి.

